నాణ్యమైన విత్తనాల సేకరణ - మొలక కట్టు విధానం
నాణ్యమైన విత్తనం లక్షణాలు: విత్తనం రైతుల ఎంచుకున్న రకానికి మాత్రమే చెందింది అయి ఉండాలి. విత్తనం వందశాతం జన్యుస్వచ్చత కలిగి ఉండాలి. భౌతిక స్వచ్చత అనేది విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండి తాలు, సగం నిండిన గింజలు ఉండకూడదు. కొనుగోలు చేసిన విత్తనాల్లో వరి రకానికి చెందిన విత్తనాలు, కలుపు విత్తనాలు, మట్టి పెడ్డలు, ఇసుక దుమ్ము ఉండకూడదు. విత్తనం ఎల్లప్పుడు సురక్షితమైన ప్యాకింగ్ చేసి పూర్తి వివరాలతో ముద్రించిన లేబుల్ కలిగి ఉండాలి.
వివిధ పంటలలో మొలక శాతం: వరి 80 శాతం, గోధుమ 85 శాతం, జొన్నలు 75శాతం, మొక్కజొన్న - సూటి రకాలు 90శాతం, సంకర రకాలు 80 శాతం, సజ్జ, కొర్ర 75శాతం, శనగ 85శాతం, అపరాలు 75 శాతం, కూరగా యలు 60-70శాతం మొలకశాతాన్ని కలిగి ఉండాలి. నూనె గింజలు... సోయా చిక్కుడు, అముదం, వేరుసెనగ 70శాతం, పొద్దుతిరుగుడు, నువ్వులు 80 శాతం, నార పంటలు (పత్తి, గోగు) 75 శాతం మొలక శాతాన్ని కలిగి ఉండాలి.
రైతు స్థాయిలో మొలకశాతం తెలుసుకునే పద్ధతులు
గుడ్డలో మూటకట్టు పద్ధతిః వంద విత్తనాలు తడిగుడ్డలో మూటకట్టి ప్లేటులో పెట్టి తరచూ మూటను నీటితో తడుపుతూ ఉండాలి. విత్తనాలు మొలకలొచ్చాక లెక్కించి మొలకశాతాన్ని తెలుసుకోవచ్చు.
ట్రే పద్ధతి / కుండీ పద్దతి: ఈ పద్ధతి లావుగింజలైన ఆముదం, శనగ, పత్తి, వేరు సెనగ మొదలైన విత్తనాల నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయో గించవచ్చు. ఇందులో మొదట ఒక ప్లాస్టిక్ ట్రే గాని లేదా కుండీనిగాని తీసు కొని ఇసుకతో నింపాలి. తదుపరి వంద విత్తనాలు అంగుళం లోతుగా నిర్ణీత స్థలంలో విత్తుకోవాలి. ఇసుకను నీటితో తడుపుతూ ఉంటే 7-10 రోజుల్లో మొలకలు వస్తాయి. అప్పుడు రైతులు వందకు ఎన్ని మొలకలొచ్చాయో లెక్కించి మొలకశాతం తెలుసుకోవచ్చు. ముందుగా నిర్దేశించిన శాతం కంటే తక్కువగా మొలకలు వస్తే నాణ్యత లోపించిన విత్తనంగా భావించాలి.
పెట్రీ డిష్ పద్దతి: చిన్న సైజు విత్తనాలు అనగా వంగ, టమాటా, మిరప మొదలు విత్తనాలు మొలక శాతం ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు
ఇందులో మొదట పెట్రిడిష్ లో బ్లాటింగ్ పేపర్ అమర్చి మూత పెట్టాలి. తేమ ఆరిపోకుండా బ్లాటింగ్ పేపరును నీటితో తడుపుతూ ఉండాలి. మొలకెత్తిన గింజలను లెక్కించి మొలకశాతాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
పేపర్ టవల్ పద్ధతి: ఈ పద్ధతి ముఖ్యంగా వరి, పత్తి, పొద్దుతిరుగుడు జొన్న తదితర విత్తనాల్లో మొలకశాతం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ముందుగా పేపర్ టవల్ లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటితో తడపాలి. తదుపరి నేలపై పరిచి వంద విత్తనాలు వరుసగా అమర్చాలి. ఇప్పుడు మరొక వస్త్రాన్ని లేదా పేపర్ టవల్ గాని విత్తనాలపై కప్పాలి. తర్వాత రెండింటిని ఒక చాపలా చుట్టి చివర్లను దారంతో కట్టి ఏదైనా లోతైన పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. తేమ అరిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నీటితో తడుపుతూ ఉంటే మొలకలు రావడం జరుగుతుంది
గమనిక: మొలకశాతాన్ని లెక్కించేటప్పుడు కుళ్లిపోయిన, మొలకరాని గట్టి విత్తనాలు, బూజుపట్టిన వేరు కాండం, పూర్తిగా అభివృద్ధి చెందని, బలహీ నంగా ఉన్న మొక్కలను పరిగణలోకి తీసుకోకూడదు.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు