దేశంలో మార్చి-ఏప్రిల్ నుండి పామాయిల్ ధరలు తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఎందుకనగా, మలేషియాలో పామాయిల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండడమే ఇందుకు నిదర్శనం. ఇదే వ్యవధిలో భారతదేశంలో రబీ సీజన్ పంట రాబడులు పోటెత్తనున్న ఆవాలు, వేరుసెనగ, కుసుమలు, నువ్వులు లాంటి రాబడులు మరియు రైస్-బ్రాన్ తౌడూనూనె అమ్మకాలపై ఒత్తిడి పెరగగలదు. అంతేకాకుండా, రష్యా, ఉక్రెయిన్తో పాటు ఇతర అన్ని సన్ఫ్లవర్ ఉత్పాదక దేశాల నుండి వృద్ధి చెందనున్న సరఫరా మరియు ప్రపంచ సోయా స్టాకిస్టులు కూడా తమ సరుకు విక్రయించేందుకు సన్నద్ధం కాగలరు.
ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారతదేశంలో రబీ మరియు యాసంగి నూనెగింజల ఉత్పత్తి గణనీయంగా ఉన్నందున రాబడులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ధరలు అరికట్టేందుకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టగలదు. అంతేకాకుండా, ప్రపంచ వ్యాప్తంగా పోటెత్తనున్న సోయాచిక్కుడు రాబడులు మరియు మరోసారి విజృంభించనున్న కరోనా వైరస్ సరఫరాపై దుష్ప్రభావం పొడసూపే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో దిగ్గజ వ్యాపారులు వంటనూనెల నిల్వకు బదులు క్రయ విక్రయాలపై దృష్టి సారిస్తుంటారు. కావున రిటైల్ వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోళ్లు ఉంటాయి.
ప్రపంచంలో రెండో అతిపెద్ద పామాయిల్ ఉత్పాదక దేశమైన మలేషియాలో పామాయిల్ క్రషింగ్ సీజన్ ప్రతియేటా మే నెల నుండి ప్రారంభమవుతుండగా, ఈసారి మే నెలలో ప్రారంభమవుతున్న రంజాన్ మాసం ముగిసిన తర్వాత చేపట్టే అవకాశం ఉందని వంటనూనెల ప్రముఖ విశ్లేషకులు దొరాబ్ మిశ్రి పేర్కొన్నారు. ఈ ఏడాది పామాయిల్ ఉత్పత్తి 1.80 కోట్ల టన్నుల నుండి పెరిగి 1.90 కోట్ల టన్నులకు చేరగలదని భావిస్తున్నారు. అప్పటి వరకు సరఫరా తగ్గడం వలన బెంచ్ మార్క్ ధర 5000–5400 రింగిట్ వద్ద కదలాడగలదు. అయితే, వచ్చే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో ధర తగ్గి 4800 రింగిట్ ప్రతి టన్నుకు దిగిరాగలదు.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు