దేశంలో శనగల ఉత్పత్తి గణనీయంగా ఇనుమడించినందున మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పోటెత్తుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో మద్దతు ధరతో పోలిస్తే తక్కువ ధరతో వ్యాపారమవుతున్నందున వ్యాపారులు కొత్త సరుకును నిల్వ చేస్తున్నారు. తద్వారా ధరలకు మద్దతు లభిస్తున్నది.
ప్రస్తుతం గుజరాత్ లో శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.16 ల.హె. నుండి పెరిగి 11.32 ల.హె.కు విస్తరించింది. ప్రతి హెక్టారు దిగుబడి 1761 కిలోల నుండి పెరిగి 2490 కిలోల ఉండగలదని భావిస్తున్నారు. ఫలితంగా 2021-22 రబీ సీజన్ కోసం క్రితం ఏడాది 14.37 ల.ట.కు గాను వృద్ధి చెంది 24.90 ల.ట. సరుకు దిగుబడి రాగలదని తెలుస్తోంది. తద్వారా గుజరాత్ సర్కార్ అభ్యర్థన మేరకు కేంద్ర సర్కారు కనీస మద్దతు ధర రూ. 5230 తో 4.65 ల.ట. శనగలు కొనుగోలు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది.
దేశంలో శనగల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 119 ల.ట. నుండి పెరిగి 131.20 ల.ట.కు చేరగలదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ రెండవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. దేశంలో కొత్త సీజన్ ప్రారంభ సమయంలో వ్యాపారులు మరియు రైతుల వద్ద గత ఏడాది సరుకు నిల్వలు దాదాపు 20 శాతం మేర అమ్మకం కాకుండా మూలుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితులలో 2023 కొత్త సీజన్ ప్రారంభంలో మిగులు నిల్వలు మరింత పేరుకుపోయే అంచనాతో వ్యాపారులు రూ. 300-400 లాభంతో సరుకు విక్రయించి బయట పడడం శ్రేయస్కరం.
ముంబైలో టాంజానియా శనగలు రూ. 4500, రష్యా కాబూలీ శనగలు రూ. 4650-4700, సూడాన్ సరుకు రూ.5000-5250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
దిల్లీ లారెన్స్ రోడ్ గత వారం 95-100 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5150, మధ్య ప్రదేశ్ ప్రాంతపు సరుకు రూ. 5075 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 200 వాహనాల శనగల రాబడి అవుతన్నాయి. కర్నూలులో జెజె రకం శనగలు రూ. 4625, ఒంగోలు శనగలు రూ. 4400, కాక్-2 కాబూలీ శనగలు రూ. 5900, డాలర్ శనగలు రూ. 7900, ఆంధ్ర ప్రాంతం శనగలు చెన్నై డెలివరి రూ. 5000-5050, కర్ణాటకలోని హుబ్లీ, ధార్వాడ్ ప్రాంతాల శనగలు రూ. 5000-5025, గదగ్ ప్రాంతం సరుకు రూ.5100, రాయిచూర్ సరుకు రూ. 5125 ధరతో వ్యాపారమైంది.
కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి 35-40 వేల బస్తాల రాబడిపై స్థానికంగా రూ. 4450-4750 మరియు మహారాష్ట్ర మార్కెట్లలో కొత్త సరుకు రూ. 4500–5000 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ దేశీ సరుకు రూ. 5025-5075, డాలర్ శనగలు రూ.7500-8300, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ.200-250 పెరిగి రూ. 8750, 44-46 కౌంట్ రూ. 8600, 58-60 కౌంట్ రూ. 7900, 60-62 కౌంట్ రూ.7,624 కౌంట్ రూ. 7700, గుజరాత్లోని రాజ్కోట్, గోండల్, జామ్నగర్, జునాగఢ్ ప్రాంతాలలో కొత్త శనగలు రూ. 4500-4950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు